ఏడున్నర గంటలు ఏం ప్రశ్నించారు.. కేసీఆర్‌కు వివరించిన Kavitha !

by Nagaya |
ఏడున్నర గంటలు ఏం ప్రశ్నించారు.. కేసీఆర్‌కు వివరించిన Kavitha !
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆమె నివాసంలోనే ఏడున్నర గంటలపాటు విచారించారు. సీబీఐ డీఐజీ పర్యవేక్షణలో ఆరుగురు అధికారుల బృందం షెడ్యూలుకంటే పది నిమిషాల ముందే కవిత ఇంటికి చేరుకున్నది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం ఆరున్నర వరకూ కొనసాగింది. లిక్కర్ స్కామ్‌తో ఉన్న సంబంధాలపై అనుమానాలను నివృత్తి చేసుకోడానికి సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 ప్రకారం ఆమెను ప్రశ్నించి చివరకు న్యాయవాది సమక్షంలో రికార్డెడ్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. విచారణ ముగిసిన వెంటనే ఆమె నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని కారులో ప్రగతి భవన్ వెళ్లారు. సీబీఐ అధికారుల విచారణ తీరును కేసీఆర్‌కు వివరించారు. దాదాపు ముప్పావుగంటపాటు అక్కడే ఉన్న కవిత రాత్రికి ఆమె నివాసానికి చేరుకున్నారు.

మీడియాకు దూరంగా..

సీబీఐ అధికారులు ఏమేం ప్రశ్నలు వేశారు, దానికి ఎలాంటి సమాధానం ఇచ్చాననే వివరాలను తొలుత మీడియా సమావేశంలోనే వెల్లడించాలనుకున్నప్పటికీ లీగల్ నిపుణులతో మాట్లాడిన తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. పత్రికా ప్రకటనను మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ప్రగతి భవన్ కు వెళ్లి తండ్రి కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత ఆ ప్రకటనను కూడా ఇవ్వలేనంటూ వివరణ ఇచ్చారు. ఏడున్నర గంటల పాటు విచారణ ఎలా జరిగిందనేది తండ్రికి వివరించిన కవిత ఆ వివరాలను మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. సీబీఐ అధికారుల విచారణ జరుగుతున్నంతసేపూ కొద్ది దూరంలో రోడ్డుమీదనే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉత్కంఠను అనుభవించారు. విచారణ ఎప్పటికి ముగుస్తుందోననే టెన్షన్‌లో ఉండిపోయారు.

పలకరించిన ఎమ్మెల్యేలు, నాయకులు

విచారణ ముగించుకుని సీబీఐ అధికారులు వెళ్లిపోయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, శ్రేణులు కవిత నివాసంలోకి వెళ్లి పలకరించారు. గంట సేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె కేడర్‌కు విక్టరీ సింబల్ చూపిస్తూ అభివాదం చేశారు. సీబీఐ అధికారుల ప్రశ్నలన్నింటినీ ధైర్యంగా, విజయవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. "ప్రస్తుతానికి సీఆర్‌పీసీ 160 కింద ఇచ్చిన నోటీసు ప్రకారం వివరణ తీసుకునే ప్రక్రియ ముగిసింది. ఇప్పటికి అవసరమైన వివరాలు తీసుకున్నాం.. అవసరమైతే భవిష్యత్తులో మరోసారి నోటీసు ఇస్తాం.. వివరణ తీసుకుంటాం.." అని సీబీఐ అధికారులు చెప్పినట్లు కవిత సన్నిహితులు, మీడియాకు వివరించారు.

మరోసారి విచారణ?

'ప్రస్తుతానికి'.. 'ఇప్పటికైతే' అనే పదాల ప్రస్తావన రావడంతో మరోసారి కూడా విచారణకు పిలుస్తారేమోననే సందేహాలు గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాది కాలం పాటు ఇలాంటి కక్షసాధింపు చర్యలు, బెదిరింపులు ఉంటాయని, అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇలా వేధిస్తూనే ఉంటారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో వ్యాఖ్యానించారు. ఇకపైన కూడా సీబీఐ, ఈడీల విచారణలు కొనసాగుతాయన్న సందేహాన్ని వ్యక్తం చేసినట్లయింది. ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారించిన తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారని, బెదిరించారని వ్యాఖ్యానించారు. దీనికి సీబీఐ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు కవిత అలాంటి అవకాశానికి తావు ఇవ్వకుండా మీడియాకు దూరంగా ఉన్నారు.

అంతా సస్పెన్స్..

ఉదయం 11.00 గంటలకు పదినిమిషాల ముందే రెండు కార్లలో సీబీఐ అధికారులు బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఏమేం ప్రశ్నలు వేశారు, వాటికి కవిత ఎలాంటి జవాబు చెప్పారు.. తదితరాలేవీ అటు కవితగానీ, ఇటు సీబీఐ అధికారులుగానీ వివరించలేదు.

లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయానికి సంబంధించి ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల్లో పలువురి నుంచి సీబీఐ వివరాలను సేకరించింది. అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాలను నివృత్తి చేసుకోవాలనుకుంది. 'సౌత్ గ్రూపు' పేరుతో ఎమ్మెల్సీ కవితతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్‌ టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో జోక్యం చేసుకున్నారని, విజయ్ నాయర్ (ఓన్లీ మచ్ లౌడర్ ఎంటర్‌టైన్‌మెంట్ మాజీ సీఈఓ) ద్వారా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపుల రూపంలో ముట్టచెప్పారని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నది. రాధా ఇండస్ట్రీస్ అధినేత దినేష్ అరోరా బ్యాంకు అకౌంట్ నుంచి కూడా బదిలీ అయినట్లు అందులో పేర్కొన్నది.

విజయ్ నాయర్, శరత్‌చంద్రారెడ్డి, బోయిన్‌పల్లి అభిషేక్, కవితకు వ్యక్తిగత ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు తదితరులను విచారించిన సీబీఐ వారి నుంచి రాబట్టి సమాచారంలోని అంశాలపై కవిత నుంచి వివరణ తీసుకోవాలని భావించి ఈ నోటీసులను జారీచేసింది. విచారణ సందర్భంగా ఆమె నుంచి లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన వివరాలన్నింటినీ ఏడున్నర గంటల పాటు ప్రశ్నించి రాబట్టింది. సీబీఐ అధికారులు రావడానికి ముందే కవితకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వొకేట్ సారంగపాణి ఆమె నివాసానికి (స్టేట్ ప్రోటోకాల్ వాహనంలో) చేరుకున్నారు. సీబీఐ అధికారులు ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టిన తర్వాత వీడియో రికార్డింగ్ రూపంలో ఆమె నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేసుకున్నారు. అధికారుల వెంట స్టెనోగ్రాఫర్ కూడా ఉన్నట్లు తెలిసింది.

Also Read...

బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ భారీ స్కెచ్

Next Story

Most Viewed